1నుంచి 8వ తేదీ వరకు మోసాలు…ఆపై జల్సాలు!
నెలలో మొదటి 8రోజులు మోసాలకు పాల్పడి, ఆతరువాత సొంత వ్యాపారాలు, జల్సాలతో గడుపుతున్న ఇద్దరు అంతః రాష్ట్ర మోసగాళ్లను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్టు చేశారు. మొదటి 8రోజులే…

నెలలో మొదటి 8రోజులు మోసాలకు పాల్పడి, ఆతరువాత సొంత వ్యాపారాలు, జల్సాలతో గడుపుతున్న ఇద్దరు అంతః రాష్ట్ర మోసగాళ్లను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్టు చేశారు. మొదటి 8రోజులే ఎందుకంటే ఆతరువాత పెన్షనర్ల వద్ద డ్రా చేసేందుకు డబ్బులుండవన్నది వారి ఉద్దేశం. ఈ ఇద్దరూ ఎటిఎంల వద్ద కాపు కాసి నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ డిఎస్పీ కె రమేష్ బాబు వెల్లడించారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీసుస్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ ఆర్ ఎస్ కె బాజీలాల్, ఎస్ఐ ఎస్ శివప్రసాద్ తో కలిసి ఈకేసు వివరాలను వెల్లడించారు. పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి చెందిన చల్లమూరు వెంకట భాస్కరరావు @ భాస్కర్, పొన్నాడ కిరణ్ లను మోరంపూడి జంక్షన్ వద్ద నిఘా ఉంచి, అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2లక్షల 6వేల నగదు, 23 ఎటిఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్, టూటౌన్, రాజానగరం, రావులపాలెం పోలీసుస్టేషన్ల పరిధిలో వీరు మోసాలకు ఎటిఎం మోసాలకు పాల్పడ్డారు. వీరిని తొలిసారిగా రాజమహేంద్రవరం పోలీసులే అరెస్టు చేయడం విశేషం. గతంలో విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కూడా 15 మోసాలకు పాల్పడినట్లు వారు విచారణలో వెల్లడించారు. ఈఇద్దరు నిందితులు ఎటిఎంల వద్ద మాటు వేసి, అమాయకులైన వ్యక్తులను గుర్తించి, నగదు డ్రా చేసుకునేందుకు సహాయం చేస్తున్నట్లు నటించి, కార్డు పనిచేయడం లేదని ఎంతో చాకచక్యంగా తమ వద్ద ఉన్న ఎటిఎంను ఇచ్చి, వారి కార్డును కాజేస్తారు. అప్పటికే పిన్ నెంబర్ తీసుకుని ఉండటంతో అమయాకులైన వారి కార్డులను వినియోగించి నగదును డ్రా చేసుకుంటారు. నెలలో 8రోజుల పాటు మాత్రమే ఈమోసాలకు పాల్పడే భాస్కర్, కిరణ్ లు మిగిలిన రోజుల్లో సొంత వ్యాపారాలు, జల్సాలు చేసుకుంటారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనం వల్లే వారు ఈమోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలాంటి మోసగాళ్లను దృష్టిలో ఉంచుకుని ఎటిఎంల వద్ద అపరిచితులను నమ్మవద్దని, అనుమానం వస్తే 112 నెంబర్ కు ఫోన్ చేయాలని డిఎస్పీ రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు.
ఈసందర్భంగా దొంగల పేరు చెప్పి ఒక మహిళ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పరారైన రాజమహేంద్రవరం రూరల్ నామవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ చొల్లంగి విజయ్ కుమార్ అలియాస్ సిమ్ముల పండును అరెస్టు చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన రాజేంద్ర నగర్ కు చెందిన ఒక మహిళ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విజయ్ కుమార్ ఆటో ఎక్కారు. కొంతదూరం వెళ్లిన తరువాత వొంటి మీద బంగారం ఏది ఉండకూడదు, దొంగలు తిరుగుతున్నారు అని చెప్పి ఆమె చెవి దిద్దులు లను తీసి ఒక పేపర్ లో చుట్టమని, వాటిని ఆవిడ బ్యాగ్ లో పెట్టుకొనే సమయంలో విజయ్ కుమార్ వాటిని తస్కరించాడు. అతని వద్ద నుండి 4 గ్రాముల బంగారపు చెవి దిద్దులు, ఆటోను పోలీసులు సీజ్ చేశారు. 2019లో కూడా విజయ్ కుమార్ పై ఇదే తరహా కేసు నమోదైంది. ఈకేసుల దర్యాప్తులో ప్రతిభ కనపరిచిన సిఐ, ఎస్ ఐ, క్రైం పోలీసులు ఎన్ రాంబాబు, కె ప్రదీప్ కుమార్, వీరబాబులను అభినందించడంతో పాటు రివార్డులకు సిఫార్సు చేశారు.